అన్నమయ్య ఎలాగంటున్నాడో చూడండి ! ఈ భూమిపై , అన్నీ వృధా, వ్యర్థం. ఈ క్రింది పాటలో, ఏది. ఈ ప్రపంచంలో ఉపయోగపడే విషయం ? ఏది ఉపయోగ పడదో వివరించారు.
“ వెఱపులు వొరపులు వృధా వృధా , ధరపై మరి అంతయును వృధా “ (1, సంకీర్తన 217)
అన్ని బంధాలూ వృధానే. ఎందుకంటే, పోయేటప్పుడు అవన్నీ విడచి పోవాలిగా!!!
ఎవ్వరూ నీతో వెంట రారు గదా!!! మరి, ఈ బంధుత్వాలకోసం ఎన్నో చెడ్డ పనులు చేసి, ఎంతో పాపాన్ని
కూడకట్టుకొని, నాది నాది అంటూ ఎన్నో కస్టాలు భరించితే, చిట్టా చివరికి నీతో ఎవ్వరైనా వస్తున్నారా? ??
ఒక్కడివే వస్తావు. ఒంటరిగా పోతావు. అందుకని , ప్రాపంచికత వ్యర్థం, అంటారు అన్నమయ్య.
“ తడయక చేసిన దానంబులు వృధా, ఎడయక ఎరిగిన ఎరుక వృధా
ఒడలిలోని హరినొనరగ మతిలో , తడవని జీవమే తనకు వృధా “
మనలోనున్న దైవాన్ని , మనస్సులో తలచుకోని జీవితం, ఎన్ని దానాలు చేసినా వ్యర్ధమే.
“ జగమున బడసిన సంతానము వృధా, తగిలి గడించిన ధనము వృధా
జగదేక విభుని సకలాత్ముని హరి , తెగి కొలువని బుద్ధియును వృధా “
అన్నిజీవులలోనున్న సర్వాంతర్యామియైన హరిని మెచ్చి పూజించక, పడీపడీ సంపాదించిన సంపదలు,
సంతానమూ వ్యర్ధమే.
“ పనివడి కూడిన పరిణామము వృధా , వొనరగ వుండిన ఉనికి వృధా
ఘనుడగు తిరువేంకటగిరి హరిగని , మననేరని జన్మములు వృధా “
శ్రీ వెంకటా ద్రి మీద నెలకొన్న గొప్పవాడైన వేంకటేశ్వరుని హరిని, ఆ వేంకటేశ్వరుని మనసార పూజించక,
చేసిన అనేకమైన పనులు , వాటి ఫలములు , ఉండే వునికే వ్యర్ధము, అన్నారు అన్నమయ్య.
సారాంశమేమిటంటే , అంటే, ఈ జన్మమెత్తినందుకు , సాఫల్యము శ్రీ హరి స్మరణమే.
మిగిలిన పనులేవైనా చేయక తప్పదు గనుకే చేయాలి. అవీ ధర్మబద్ధమైన పనులే చేయాలి.
సంపదలూ, సంతానములూ, సంబంధాలూ , బాంధవ్యాలూ, పదవులూ, పేర్లూ ...... అన్నీయూ ,
శ్రీ వేంకటేశ్వరుని పూజించినపుడే, సార్ధకమౌతాయి గానీ, లేకుంటే , వృధా అయి ఫలించవు.
దైవాన్ని మరువకుండా , మంచి బుద్ధితో జీవితాన్ని గడపమని అన్నమయ్య వేదాంతం.
అన్నమయ్య మాట
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి